ఓం వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః
లలితా సహస్రనామం లోని ఒక మహా మంత్రము ఇది. అమ్మవారి ముఖము పరివాహము అంటే నదీ ప్రవాహము. అసలు అమ్మవారి ముఖమే చాలా సౌందర్యంగా ఉంటుంది. అందుకే దానిని వక్త్ర లక్ష్మీ అన్నారు. ముఖలక్ష్మి, మహా అద్భుతమైన సౌందర్యంతో ఉన్న అమ్మవారి ముఖమును చూడగానే వర్షాకాలంలో వేగముగా ప్రవహిస్తున్న నది లాగా ఉంటుందట. అమ్మవారి ముఖలక్ష్మి ఒక నదీ ప్రవాహమయితే, ఆ ప్రవాహంలో కదులుతున్న చేపలు లాగా ఉన్నాయట అమ్మవారి కళ్ళు.
అసలు ఆడవారి కళ్ళను చేపలతో పోలుస్తారు. చేపలు మిలమిలలాడుతూ ఉంటాయి, ఈ కళ్ళు కూడా అలాగే మిలమిలలాడుతూ చేపల లాగా ఉంటాయి, అందుకే అమ్మవారికి మీనాక్షి అని కూడా ఒక పేరు ఉన్నది. ఎందుకు చేపల తోనే పోల్చారు, పద్మాక్షి అనకుండా, ఈ నామాన్ని ఇక్కడ ఎందుకు ప్రయోగించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము.
చేప తన పిల్లలను పాలిచ్చి పెంచదు, లేదా వేరే ఆహారం పెట్టి పెంచదు, అలా చూపులతో పెంచుతుంది. చేపలు గుడ్లు పెడతాయి, ఈ గుడ్లు వాటంతటవే పాలు లేకుండా పెరిగి పెద్దవవుతాయి, పెరిగి పెద్దయ్యాక వాటి ఆహారము ఎలాగో అవి చూసుకుంటాయి, కానీ పిల్లలను చేప అలా చూసీ చూడగానే వాటికి పాలు ఆహారము అందినట్లుగా అయి అవి పెరుగుతాయి.
ఇంకొక విషయము కూడా ఉన్నది. చేప ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే నిద్రపోతుంది, దానికి ఉన్న ప్రత్యేకత అది. అమ్మవారు కూడా తన చూపులతో లోకాలను పోషిస్తుంది.
అమ్మవారి కళ్ళు ఎప్పుడూ పొరపాటున కూడా మూతపడవు, ఒకవేళ మూతపడ్డాయి అంటే లోకాలు నాశనం అయిపోతాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః అన్నారు.
అమ్మ అలా కన్నుమూసిందంటే చాలు, మొత్తం లోకాలన్ని సర్వ నాశనం అయిపోతాయి. కన్ను తెరిచిందంటే లోకాలు పుడతాయి, తెరిస్తే పుట్టడం, మూస్తే ప్రళయం.
అందువల్ల చేపలాగా అమ్మ కళ్ళు తెరిచే ఉంటుంది తప్ప మూయదు అని చెప్పడం ద్వారా అమ్మ కళ్ళు తెరిచే మన అందరినీ రక్షిస్తూ ఉంటుంది. చూపులతో లోకాలను కాపాడుతూ ఉంటుంది.
మంత్ర ప్రయోగము - ఫలితము:
పిల్లల అభివృద్ధికి బాగా ఉపయోగపడే మంత్రము ఇది.
ఎలాగైతే చేప తన చూపులతో పిల్లలను అభివృద్ధి చేస్తుందో, అలాగే ఈ మంత్ర జపము చేసిన వారిని కూడా అమ్మ అత్యద్భుతమైన స్థితికి తీసుకొని వెళుతుంది.
పిల్లలు సరిగా చురుకుగా లేకపోయినా, పాఠశాలకు వెళ్లడానికి పేచీలు పెడుతున్నా, చదువంటే ఆసక్తి లేకుండా ఎప్పుడూ ఇంటిలో కూర్చోవాలి అనుకుంటున్నా లేదా ఇంకేదైనా కారణాలతో ఉత్సాహం లేకుండా పడుకుంటున్నా అటువంటి పిల్లలు చురుకుగా తయారయి పాఠశాలకు వెళ్లి బాగా చదువుకొని అభివృద్ధి లోనికి వచ్చేలాగా చేసే అపూర్వ మంత్రము ఈ మంత్రము.
మనము చేయవలసిందల్లా చిన్న పిల్లల చేత కుంకుమ పట్టించి, ఆ పిల్లల యొక్క కుడిచేతి మధ్యవేలు, ఉంగరం వేలుతో కుంకుమను తీసుకొని కుడి చేతి బొటన వేలుతో ఆ కుంకుమను అమ్మవారి పాదాల మీద పడే లాగా పూజ చేయిస్తూ రోజూ ఈ నామమును 108 సార్లు జపం చేయించాలి. అమ్మవారి పటము, లలితాదేవి పటము లేదా విగ్రహమును మాత్రమే పెట్టించి, పిల్లలతోనే దీపారాధన చేయించి, ఏదైనా ఒక తీపి పదార్ధమును వారి చేతనే నైవేద్యముగా పెట్టించి, వారు చదవగలిగితే ఈ నామాన్ని వారి చేతే జపం చేయించండి, వారు ఒకవేళ జపించలేకపోతున్నారనుకోండి, నాలుక అంత స్పష్టంగా లేదు అనుకుంటే మీరు జపం చేస్తూ మీరు కానీ పిల్లలు కానీ చేయండి. పూజ మాత్రం పిల్లలతోనే చేయించండి, అలా 40 రోజులపాటు గానీ లేదా 27 రోజులపాటు కానీ పిల్లలతో ఈ మంత్రం జపం చేస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే ఆ పిల్లలు చురుకుగా తయారయ్యి, బాగా చదువుకొని, అభివృద్ధిలోకి వస్తారు. దాని వలన చాలా లాభాలు పొందుతారు. కాబట్టి ఈ మంత్రాన్ని చేయించండి. అర్చన అయిపోయాక పటాన్ని ఇంటిలోనే ఉంచుకోవచ్చు.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.