ఓం సర్వలోకచారిణే నమః
అత్యద్భుతమైన హనుమన్ మంత్రాలలో ఇది కూడా ఒకటి. సర్వ అంటే అన్ని లోకాలు సంచరించేవాడు హనుమంతుడు.హనుమంతుడు తిరగలేని లోకం అంటూ లేదు.
హనుమంతుడు బ్రహ్మలోకము మొదలుకొని అధోలోకాల వరకు తన యొక్క మహా బలముతో, మహా వేగముతో, మహా పరాక్రమముతో చిటికెలో వెళ్ళగలడు ఆయన. మహా విశాలమైన శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని కూడా అవలీలగా దాటినవాడు ఆయన. 100 యోజనముల విస్తీర్ణం ఉన్న సముద్రాన్ని దాటి లంకా నగరమునకు వెళ్ళినా కూడా ఆయన ఒక్క నిట్టూర్పు కూడా విడవలేదు, ఏ మాత్రము ముఖములో అలసట లేదట. అంతటి మహా పరాక్రమవంతుడు సమస్త లోకములు తిరగడము పెద్ద కష్టం ఏమీ కాదు.
ఆయన తలుచుకుంటే ఒక చిటికె వేసే కాలములో వెళ్లి రాగలడు అటువంటి మహాత్ముని మంత్రము. ఈ మంత్రము విదేశీ యాత్రలకు పనికివచ్చే మంత్రము.
ఇవాళ చాలా మంది ఏదో దేశానికి వెళ్లి చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరుతున్న వాళ్లు అక్కడ కొంతకాలం ఉండి ధనము సంపాదించి మళ్లీ మన దేశానికి వచ్చి ఇక్కడ సేవ చేయాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. విదేశీయాన ప్రయత్నం సక్రమంగా జరగక బాధపడుతున్న వారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసా దొరకక బాధపడుతున్నవారు ఈ మంత్రమును అనుష్ఠానము చెయ్యండి.
మంత్ర ప్రయోగము ౼ ఫలితము:
శనివారము కానీ మంగళవారం కానీ పూజామందిరములో హనుమంతుని యొక్క విగ్రహం బొటనవేలు అంత సైజు మించకుండా రాగితో గానీ ఇత్తడితో గానీ ఏదైనా లోహంతో చేసిన విగ్రహం కావచ్చు (ఇనుముతో చేసిన విగ్రహాలు మాత్రం వాడకూడదు, కేవలం శని గారికి మాత్రమే ఇనుముతో చేసిన విగ్రహాలు వాడవచ్చు) పూజామందిరంలో పెట్టుకుని మంగళవారము కానీ శనివారము కానీ పూజ ప్రారంభించాలి. శుక్రవారం కూడా పనికొస్తుంది అని చెప్పారు. ప్రథమ స్థానం మంగళవారం రెండవ స్థానం శనివారము మూడవ స్థానం శుక్రవారము. ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు హనుమంతుని విగ్రహమును పూజామందిరంలో పెట్టుకుని 40 రోజుల పాటు గంధ సింధూరంతో అనగా హనుమంతుడిని పూజించే కుంకుమతో ఈ మంత్రము చెప్పుకుంటూ ఓం సర్వలోక చారిణే నమః అంటూ కుడిచేతి మధ్యవేలు ఉంగరం వేలితో ఆంజనేయుని మీద ఈ గంధ సింధూరమును వేస్తూ ఈ మంత్రముతో పూజ చేయాలి. 1008 సార్లు జపం చేస్తూ 40 రోజులపాటు సింధూరంతో ఆంజనేయుడిని పూజించాలి. 41వ రోజు అప్పాలు నైవేద్యంగా పెట్టి ఈ అప్పాలను భక్తులందరికీ ప్రసాదంగా పెట్టండి. ఆడవాళ్లకు ఇబ్బంది వస్తే నాలుగు రోజులు ఆపివేసి మళ్ళీ ఐదవ రోజు నుంచి ప్రారంభించండి. చివరి రోజున అప్పాలు నైవేద్యంగా పెట్టండి.
తరువాత ఈ విగ్రహాన్ని యథాస్థానం ప్రవేశయామి అని అంటే తిరిగి పంపించేస్తున్నాము అని స్వస్తిచెప్పి కదిపేసి ఎవరైనా ఒక పండితునికి దక్షిణ తో తాంబూలముతో దానం ఇచ్చి వేయండి.
భగవంతుడి విగ్రహము ఇంటిలో ఉండడం ఎప్పుడూ మంచిదే కానీ ఒక కార్యసిద్ధి కోసం తెచ్చుకున్న విగ్రహం కాబట్టి కార్యసిద్ధి అయిపోయాక దానిని భరించే శక్తి పండితులకే ఉంటుంది. వీలుంటే ముగ్గురు లేక ఐదు మందికి భోజనము పెట్టుకోండి. పూర్వం సముద్రం మీద ప్రయాణానికి వెళ్లే వర్తకులంతా ఈ మంత్రమును అనుష్ఠానం చేసేవారట.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.