ఓం కదంబ వనవాసిన్యై నమః
కదంబము అని ఒక వృక్షము ఉన్నది, దీనిని సంస్కృతంలో కదంబము అంటారు, తెలుగులో కడిమిచెట్టు అంటారు. శ్రీకృష్ణుడికి, అమ్మవారికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన చక్కటి చెట్లలో ఇది ఒక చెట్టు.
అసలు ఈ చెట్టు పెరగాలి అంటే లలితా సహస్రనామం పారాయణ చేయండి అనేవాళ్ళు పూర్వము. లలితా సహస్రనామము పారాయణ జరగని చోట ఈ చెట్టు అసలు పెరగదు. అమ్మవారికి ఈ చెట్టు అంత ప్రీతిపాత్రమైనది.
అసలు ఒక్క చెట్టు అంటేనే అమ్మకు ఇష్టము అంటే ఇక చెట్లతోట, అనేక వృక్షాలు ఉన్న తోటలో మనము అమ్మను పూజిస్తే అమ్మ ప్రత్యక్షము కాకుండా ఉంటుందా? అమ్మ కదంబ వనవాసిని అంటే అమ్మవారు కదంబ వృక్షముల తోటలో నివసించునది అని అర్థము.
మానవ జీవితానికి అనేక దుఃఖములు ఉన్నాయి, కానీ అందులో ఐదు దుఃఖముల గురించి ఎక్కువగా చెప్పాయి మన పురాణాలు.
ఈ ఐదు రకముల దుఃఖములు మానవులను అనుక్షణము పట్టి పీడిస్తూనే ఉంటాయి.
అందులో కొడుకులు పుట్టకపోవడం ఒక దుఃఖము, వాళ్ళు పుట్టి దుర్మరణం పాలవడం మరొక దుఃఖము. అసలు పిల్లలు లేకపోతే ఒకటే బాధ, కానీ పిల్లలు పుట్టి వాళ్ళు మధ్యలో చనిపోతే ఆ తండ్రికి వచ్చే బాధ అంతా ఇంతా కాదు. అందుకే పుత్ర శోకము మహా కష్టము అన్నారు, ఏదో కొద్దికాలము పోయాక మరచిపోతారు, నిత్యము ఏడుస్తూ కూర్చోరు కదా.
నిత్య దుఃఖము ఒక్కటి ఉన్నది, అది ఆకలి దప్పిక వల్ల వచ్చే దుఃఖము. పొద్దున లేచిన దగ్గరనుండి పడుకునే వరకు ఎప్పుడో ఒకప్పుడు దాహము వేస్తుంది, మంచి నీళ్లు తాగకపోతే ఆ దాహం తీరదు. ప్రయాణం చేస్తున్నప్పుడో లేక ఇంటి దగ్గర ఉన్నప్పుడో అన్నము తినకపోతే వాడు బాధపడిపోతాడు.
కాబట్టి మొదటిది పుత్రశోకం వల్ల కలిగే దుఃఖం అయితే రెండవది ఆకలి, దప్పికల వల్ల కలిగే దుఃఖము, ఇవి తీరకపోతే మహాబాధ.
ఇక మూడవది ఏమిటంటే అపనిందా దుఃఖము. చెయ్యని తప్పుకు కూడా వాడు పది సార్లు తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు అంటూ ఉంటే గిజగిజలాడి పోవడం.
మనము హాయిగా ఉందాము అనుకున్నా ఈ ప్రజలు మనలను హాయిగా ఉండనివ్వరు. వాడు నిన్ను ఇలా అన్నాడు, నీకు ఈ అపవాదం వచ్చింది అని రోజూ బాధపెడుతూ ఉంటారు, లేదా ఒకరితో ఒకరిని పోలుస్తూ ఉంటారు. దీని తోటి ఈ అపనిందలు తట్టుకోలేక అయ్యో నేను అన్నీ బాగానే ఉన్నా ఈ అపవాదాలు ఎందుకు వచ్చి పడుతున్నాయి, ఈ అభాండాలు అని బాధపడతాడు.
ఇక నాల్గవది రోగ దుఃఖము. ఇది మరీ బాధ. కాళ్ళకి, కంటికి, పంటికి, జుట్టుకి రోగాలు, గట్టిగా నాలుగు మెతుకులు తినలేడు, తింటే అరగక బాధ, పడుకుంటే ఒక బాధ, పడుకోకపోతే ఒక బాధ, శరీరమునకు బొజ్జ పెరిగిపోతే ఒక బాధ ఇలా అనేక శారీరక, మానసిక జాడ్యాలు ఉంటాయి. ఇవి ఒక బాధ. ఇక అన్నిటికంటే చివరిది, ఐదవది అసలు సంసారమే ఒక దుఃఖము అన్నారు. అందుకే సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత అని యోగ శాస్త్రములో ఒక శ్లోకము ప్రత్యేకముగా ఉన్నది.
అసలు సంసారమే ఒక సాగరము, ఈ సంసారంలో పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో పడ్డారంటే ఈ స్త్రీ, పురుషులు ఇద్దరు పిల్లల వల్ల బాధ, సంపాదన బాధ, మళ్లీ ఈ భార్య భర్తలు కొట్టుకోవడం దుఃఖం ఇలా ఈ మాయదారి సంసారంలో నిరంతరము దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఇన్ని రకాల దుఃఖములను తొలగించే మహా మంత్రము ఇది.
అసలు దీని పేరే దుఃఖ నివారణ మంత్రము. పంచ దుఃఖ నివారక మంత్రము.
మంత్ర ప్రయోగము ౼ ఫలితము:
పసుపు రంగు పువ్వులు తీసుకోండి. అంటే చామంతి పువ్వులు, సువర్ణ గన్నేరు పువ్వులు వంటివి మొదలైనవి ఏవైనా పసుపుపచ్చ రంగులో ఉండే పువ్వులు తీసుకోండి. సుగంధము ఉన్న పువ్వులు అయితే ఇంకా బాగా పనిచేస్తాయి. ఇలాంటి పువ్వులు వేయి ఎనిమిది (1008) సిద్ధం చేసుకోండి.
తొమ్మిది శుక్రవారాల పాటు అమ్మవారి విగ్రహమును కానీ పటమును కానీ దేనినో ఒకదానిని పెట్టుకొని అమ్మవారిని ఈ పువ్వులతో పూజ చేస్తూ ఓం కదంబ వనవాసిన్యై నమః అంటూ ఈ మంత్ర జపము చేస్తూ పూజ చేయండి. దొరికితే కదంబ పుష్పాలతో కూడా పూజ చేయండి. ఈ కదంబ పుష్పం యొక్క కర్ణిక పసుపురంగులో చాలా బాగా ఉంటుంది. మొత్తం తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారము ఉదయం పూట చేయాలి. అమ్మవారి పటం కానీ, విగ్రహం కానీ పెట్టుకోవాలి. ఓం కదంబ వనవాసిన్యై నమః అంటూ 1008 పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి.
నైవేద్యముగా వెన్నపూస కానీ, పంచదార కానీ, పటిక బెల్లం కానీ పెట్టాలి. ఈ నైవేద్యమును పూజ అయిన తరువాత పూజ చేసిన వారు తప్పక ప్రసాదముగా స్వీకరించాలి. ప్రసాదంగా స్వీకరించడానికి పనికొచ్చే అంత నివేదన చేయండి.
ఇలా తొమ్మిది శుక్రవారాలు చేస్తే సకల దుఃఖములు పైన చెప్పిన 5 దుఃఖములు. పుత్ర శోక దుఃఖం, ఆకలి, దప్పిక వల్ల కలిగే దుఃఖం, భార్యాభర్తలకి వచ్చే తగాదాలు, అపనిందా దుఃఖం, రోగ దుఃఖం, సంసార దుఃఖం వంటి సకల దుఃఖాలు ఈ మంత్ర ప్రభావం వలన తొలగించబడతాయి.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.