ఓం సుమేరు శృంగ మధ్య స్థాయై నమః
ఇది లలితా సహస్రనామ మహా మంత్రము. అమ్మవారు అంతటా ఉంది, ప్రత్యేకంగా మణిద్వీపము అనే ప్రదేశంలో తన దివ్య శక్తితో ఉంటుంది. ఆ అమ్మవారే భూలోకములో మనలను అనుగ్రహించడానికి హిమాలయ పర్వతాల్లో ఉన్నది. హిమాలయ పర్వతాలలో కేదార శిఖరము చుట్టూ నాలుగు శిఖరములు ఉంటాయి, ఆ శిఖరముల మధ్యలో మేరు శిఖరము ఉంటుంది. మేరు పర్వతం చుట్టూ నాలుగు శిఖరములు, మేరుపర్వతం ఒక శిఖరం మొత్తం ఐదు శిఖరములు, ఈ విధముగా ఐదు శృంగములతో ఉంటుంది (శృంగము అంటే శిఖరము) అమ్మ మధ్యలో ఉంటుంది. సుమేరు పర్వతం మధ్య లోని ఒకానొక శిఖరము మీద అమ్మవారు కొలువై ఉంటుంది.
మన శిరస్సు మీద ఉన్న బ్రహ్మరంధ్రమును కూడా సుమేరు శృంగ మధ్య అంటారు. అంటే అమ్మవారు సహస్రార కమలము నందు కొలువై ఉండే తల్లి.
ఊర్ధ్వ లోకాలలో మణిద్వీపములో అమ్మవారు ఉంటారు, అందులో నాలుగు మండపాలు ఉంటాయి, ఆ నాలుగు మండపాలలో అమ్మవారు ఉంటుంది, ఆ నాలుగు మండపాలు చుట్టూతా ఉంటే మధ్యలో ఉంటుంది, కనుక అమ్మవారిని సుమేరు శృంగ మధ్యస్థ అన్నారు.
మంత్ర ప్రయోగము౼ ఫలితము:
ఈ నామము జపము చేయడంవల్ల మానవునికి జీవితాంతము బ్రతకడానికి కావలసిన డబ్బు సంపాదించడానికి అవసరమైన ఉద్యోగం లభిస్తుంది.
ఉద్యోగం పురుష లక్షణం మానవుడై పుట్టాక ఏదో ఒక పని చేయాలి. ఒక అద్భుతమైన కీర్తి, సంపదతో కూడిన పని చెయ్యాలి.
ఏమీ కీర్తి లేకుండా, సంపాదించకుండా, పుట్టి పెరిగి యాచించి బ్రతికి చచ్చిపోతే ఏ ప్రయోజనమూ లేదు, కాబట్టి మానవుడు ఏదో ఒక మంచి పని చేయాలి. ఆ పని వల్ల సంపద రావాలి, కీర్తి కూడా రావాలి. ఇలా సంపదను, కీర్తిని కలిగించే మంచి పని ఏదైతే ఉన్నదో దానిని ఉద్యోగము అంటారు.
అటువంటి ఉద్యోగ ప్రాప్తికి ఈ మంత్ర అనుష్ఠానము చాలా ముఖ్యమైనది.
వరుసగా విడిచిపెట్టకుండా (మధ్యలో ఆపరాదు) 27 రోజుల పాటు ప్రతి రోజూ 108 మారేడు ఆకులతో అమ్మవారి రూపును కానీ, విగ్రహమును కానీ లేదా లలితాదేవి పటమును కానీ పెట్టుకొని ఈ 108 మారేడు ఆకులతో అమ్మను పూజించండి. జపము మాత్రము 1008 సార్లు చేయండి. ఓం సుమేరు శృంగ మధ్యస్థాయై నమః, ఇలా 27 రోజుల పాటు ఏకధాటిగా 108 మారేడు ఆకులతో అమ్మను పూజించి 1008 సార్లు ఈ మంత్ర జపము చేసి తరువాత యథాశక్తిగా కర్పూర నీరాజనం ఇచ్చి, ఆ తల్లి అనుగ్రహం పొందితే కేవలము మూడు నెలల్లో ఉద్యోగము వస్తుంది అని చెప్పారు.
జపములో లోపం ఉంటే కొద్దిగా ఎక్కువ సమయం (ఒక సంవత్సరకాలము) పట్టే అవకాశం ఉంటుంది.
మనము ఎంత ఎక్కువ భక్తి శ్రద్ధలతో మనసు చెదరకుండా జపము చేస్తే అంత తొందరగా ఫలితం లభిస్తుంది. ఈ మనస్సు చంచలత్వము పొందుతుంది కదా, కాసేపు నమ్మి కాసేపు నమ్మకుండా చేస్తే ప్రయోజనం ఉండదు, మనసు అటు ఇటు చెదిరిపోకుండా చూసుకోండి. ఈ ఆకులతో పూజ చేసే వాళ్ళు ఒక విషయం గుర్తు పెట్టుకోండి, 27 రోజుల పాటు 108 బిల్వపత్రాలతో పూజ చేస్తున్నారు కదా, ఈ ఆకులను 27 రోజులు అయ్యేవరకూ తీయకండి, అమ్మవారి విగ్రహము మీద ఉన్న ఆకులను పైపైన అటు పక్కకి జరపండి తప్ప, పూజా మందిరంలో నుంచి తీసి వేయవద్దు.
27 రోజులపాటు పూజామందిరంలో అట్లే పెట్టండి. మారేడు ఆకులు ఇంటిలో ఎండిపోతే కూడా ఆరోగ్యానికి మంచిది, కుటుంబానికి కూడా మంచిది.
27 రోజులు అయిపోయాక చివరన మంగళవారము లేక శుక్రవారము కాకపోతే విగ్రహాన్ని కదపండి, ఒకవేళ మంగళవారం అయితే మరుసటి రోజు బుధవారం నాడు కదపండి, ఒకవేళ శుక్రవారం అయితే మరుసటి రోజు శనివారం నాడు కదపండి.
ఈ ఆకులను మీ పెరటిలో గొయ్యి తవ్వి, పూడ్చి పెట్టే అవకాశముంటే గోతిలో వేసి మట్టి వేసేయండి. అది ఇంటికి కూడా చాలా శుభము, లేదంటే దొడ్డిలో వేయండి, ఎక్కడా కుదరకపోతే కాలువలో కలిపి వేయండి.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.