Pages

Friday, April 2, 2021

గురు వ్యాఖ్యనం-46

 



*ఓం కులసంకేతపాలిన్యై నమః* 


మనకు ఉన్న ద్వాదశ అరణ్యములలో నైమిశారణ్యము చాలా గొప్పది.

ఈ నైమిశారణ్యంలో బ్రహ్మదేవుని కమండలం నుంచి ఆవిర్భవించిన గోమతి అనే నది ప్రవహిస్తూ ఉన్నది.

పూర్వం ఋషులందరూ ఇక్కడకు తపస్సు చేసుకోవడానికి వస్తే, ఇక్కడ ఒక నది కూడా కావాలి అని బ్రహ్మదేవుడిని కోరగా, బ్రహ్మదేవుడు తన కమండల జలమును భూమి మీదకు పంపాడు. అలా పంపగా వచ్చిన జలమే ప్రవాహంగా మారి నదిగా మారింది.

నిజానికి నది అంటాము కానీ గోమతిని నదము అనాలి.

 తూర్పున పుట్టి పడమరకు ప్రవహించే వాటిని నదములు అని, పడమర పుట్టి తూర్పుగా ప్రవహించే వాటిని నదులు అని అంటారు కాబట్టి, గోమతి కూడా తూర్పున పుట్టి పడమరకు ప్రవహించి ద్వారక వద్ద పశ్చిమ సముద్రం లో కలుస్తుంది కనుక గోమతిని నదము అనాలి.

ఈ గోమతి నదీ తీరంలో అమ్మవారు రాత్రి పూట తరచుగా ఒక దివ్య రూపంలో తిరుగుతుంది. ఆ దివ్య రూపమునకే కులసంకేతపాలిని అని పేరు. కులసంకేతపాలిని అంటే తన వర్ణాన్ని, తన వంశాన్ని రహస్యముగా పరిపాలించేది అని అర్థము.


మంత్ర అనుష్ఠానములకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ మంత్రములను బయట పెట్టకూడదు. ఇచ్చిన గురువుకు తెలియాలి, శిష్యులకు తెలియాలి. ఆ పరంపరలో వాళ్లంతా, తెలిస్తే వాళ్ళల్లో వాళ్ళకి తెలియాలి తప్ప బయట వాళ్లకు తెలియకూడదు.

కుల సంకేతము అంటే కుండలినీ శక్తిని ప్రచోదనం చేసే ఒక అద్భుతమైన యోగశక్తి.

ఈ యోగశక్తిని కూడా గురువుల ద్వారా తెలుసుకో వలసినదే, కాబట్టి మొత్తం మీద మంత్రాచార రహస్యములను పాలించేది, పరమపవిత్రమైన ఆచారము కలిగినది, యోగాభ్యాస తత్పరుడైన వారిని రక్షించేది; ఇటువంటి దేవతా రూపము కుల సంకేత పాలిని.


ఈ కులసంకేతపాలిని అనే నామాన్ని పూర్వము నైమిశారణ్యంలో ఉగ్రశ్రవుడు అనే పేరు కలిగిన సూతమహర్షి (సూత మహర్షి అసలు పేరు ఉగ్రశ్రవుడు, తరువాత ఆయనకు సూతుడు అని పేరు వచ్చింది) అనుష్ఠానము చేసి లోకానికి అందించాడు.

ఇది అద్భుతమైన జ్ఞాపకశక్తిని ఇచ్చే మంత్రము.

పౌరాణికులలో సూతమహర్షి ఒక్కడే పుస్తకం లేకుండా మస్తకమే సమస్తముగా 18 పురాణములను చెప్పాడు.

మొట్టమొదటగా ఈ సూతమహర్షి వ్యాసునికి శిష్యుడై, వ్యాసుని ద్వారా పురాణములను నేర్చుకుని, తరువాత 88 వేల మంది ఋషులకు ఈ పురాణములను చెప్పాడు.

ఆయనకు ఉన్నంత ధారణాశక్తి మరెవ్వరికీ లేదు.

 ఆ మహానుభావుడు ఇచ్చిన అద్భుతమైన మంత్రము ఈ కులసంకేతపాలిని అనే మంత్రము.


*మంత్ర ప్రయోగము ౼  ఫలితము:* 


ఈ మంత్రమును విడిచిపెట్టకుండా తొమ్మిది రోజులపాటు ప్రతి రోజు 1008 సార్లు జపం చేయండి.

జపము చేసిన వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి వస్తుంది.

 పుస్తకాలు మస్తకానికి ఎక్కి పోతాయి, ఒక్కసారి చదివితే గుర్తుండిపోతుంది.

ఇది అపూర్వమైన ధారణా శక్తిని పెంచే ఒక మహా మంత్రము.

జ్ఞాపక శక్తి లేకపోతే పరీక్షలలో ఏమి రాయలేము.

పూర్వము పురాణములను, వేదములను, వ్యాసములను అప్పజెప్పినట్లుగా ఇప్పుడు కూడా వేదపండితులు గురుముఖతః విని అప్పజెప్పగలుగుతున్నారు. ఆ శక్తి మనందరిలో ఎంతో కొంత ఉంటుంది. దానిని కొందరు అభివృద్ధి చేసుకుంటున్నారు, కొందరు చేసుకోలేకపోతున్నారు. అలా అభివృద్ధి చేసుకోవడానికి ఈ మంత్రము ఉపయోగపడుతుంది.

చాలామంది మనము ప్రయత్నం చేస్తే చాలు కానీ మంత్రము అవసరం లేదు అంటారు, అది కేవలం ఒట్టి భ్రమ, అన్నీ ఉండాలి.

 మన శరీరము ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం పాలై పోతుంది, అలాగే అపార ధారణాశక్తి ఉన్నా ఈ మంత్ర అనుష్టానము లేకపోతే కొంత కాలానికి అది నశించిపోతుంది.

కాబట్టి జ్ఞాపక శక్తిని పొందడానికి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ తప్పకుండా నిరంతరము అనుష్ఠానము చేయవలసిన పవిత్రమైన మంత్రము ఇది, కాకపోతే శీఘ్ర ఫల ప్రాప్తికి మాత్రం నియమం ఏమిటంటే తొమ్మిది రోజులపాటు విడిచిపెట్టకుండా 1008 సార్లు ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చొని చేయాలి.


ఇదే మంత్రమును మీరు నైమిశారణ్యంలో కానీ చేసినట్లయితే మీకు తిరుగులేని జ్ఞాపక శక్తి వస్తుంది.


ముఖ్యంగా పెద్ద పెద్ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు వెళ్ళే వాళ్లకు ఈ మంత్రము చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్నల పత్రమును చూడగానే సమాధానములు చదువుకున్నవి వెంటనే గుర్తుకు వస్తాయి.


*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. 


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...