ఓం జం జ్ఞాన వృద్ధ్యై నమః
జ్ఞాన వృద్ధి స్వరూపిణి అమ్మ, జ్ఞానవృద్ధి, జ్ఞానవృద్ధి దాయిని, విజ్ఞాన దాత కూడా అమ్మయే.
ఈ మహా మంత్రము అమ్మవారికి సంబంధించిన సప్తశతీ మహా మంత్రము.
కొంతమందికి గణితశాస్త్రం అంటే భయం, కొంతమందికి విజ్ఞాన శాస్త్రం అంటే భయము. ఇవి రెండూ చదివి కూడా కొంతమందికి పరీక్షలంటే భయం. ఇటువంటి వాళ్లకు భయం తొలగి అందులో విజయం పొందడానికి బాగా పనికివచ్చే మహత్తరమైన మంత్రము ఇది.
మంత్ర ప్రయోగము ౼ ఫలితము:
ఈ మంత్రమును ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ నాలుగు తిథులలో ఏదో ఒక నాడు ఉదయము తలకు స్నానం చేసి బొట్టు పెట్టుకుని పూజా మందిరంలో ఒక అమ్మవారి పటమును పెట్టుకొని జపమును ప్రారంభించండి.
ఏకధాటిగా పన్నెండు రోజులపాటు ప్రతిరోజూ వెయ్యి సార్లు ఈ మంత్ర జపము చెయ్యాలి.
జపము చేసేటప్పుడు పువ్వులు, పత్రి వాడండి. ఈ పత్రిలో సాధారణముగా మారేడు ఆకులు, నేరేడు ఆకులు, గరిక, తమలపాకులు మొదలైన ఆకులు (సహజముగా గణపతికి ఉపయోగించే పత్రి) వాడవచ్చును. ఇక పువ్వులలో సంపంగి, పారిజాతం, మందారం, పసుపు పచ్చగా ఉండే పువ్వులు గన్నేరు మొదలైన పువ్వులు ఒక మూడు రకాల పువ్వులకు తక్కువ కాకుండా తీసుకోండి.
వీటితో పూజ చేస్తూ
ఓం జం జ్ఞాన వృద్ధ్యై నమః
త్వం బుద్ధిః త్వం వృద్ధిః అని అమ్మవారిని కీర్తించారు, ఆ మంత్రం అన్న మాట ఇది.
జం అనే బీజం తో కలిస్తే ఇంకా తొందరగా లోపలకు వెళుతుంది.
ఈ పువ్వులను ఆకులను ఏరోజుకారోజు తీసి పూజామందిరము లోనే ఒక పక్కన పెట్టండి, బయట వేయకండి. 12 రోజులు అయ్యాక ఈ పత్రిని పువ్వులను దొడ్డిలో ఎక్కడో ఒకచోట వేయండి లేదా కాలవలో వేసేయండి లేదా గొయ్యి తీసి పాతి పెట్టేయండి లేదా బాగా ఎండబెట్టి యజ్ఞానికి వాడేయండి.
ఈ పన్నెండు రోజులపాటు ఆవునేతితో తయారు చేసిన ఏదో ఒక తీపి పదార్థము నైవేద్యంగా పెట్టండి. ఈ ప్రసాదమును జపము చేసిన వారు మరియు వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి, బయట వారు తినకూడదు, ఒకవేళ బయటి వారు ఎవరైనా ఈ ప్రసాదమును తింటే ఈ ఫలితము కొద్దిగా వారికి వెళ్ళిపోతుంది అందుకని ఈ విషయంలో కొద్దిగా కఠినముగా ఉండవలెను. ఆవు నేతితో చేసిన పదార్థము పెట్టడం వల్ల మానవునికి బుద్ధిలో సూక్ష్మత పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది,
అసలు ఈ మంత్రమే బుద్ధి కౌశల్యాన్ని జ్ఞాపకశక్తిని పెంచుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది.
ముఖ్యముగా గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము అంటే భయపడే వారు, సరిగా అవగాహన చేసుకోలేని వారు, వాటిలో పరీక్షలంటే భయపడిపోయే వారు అలాంటి వారికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది.
ఈనాడు పోటీ ప్రపంచంలో హడావిడిగా పరుగులు పెడుతున్న కాలము,
కొద్దిగా తేడా వచ్చిందంటే జీవితమంతా వ్యర్థం అయిపోయి సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతున్నాము,
కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ప్రవేశ పరీక్షలకు (కాంపిటీటివ్ ఎగ్జామ్స్) వెళ్లే వాళ్ళు 12 రోజుల పాటు ఉదయం పూట ఈ మంత్రమును అనుష్ఠానము చేయండి.
ఈ మంత్రానుష్ఠానమును పైన చెప్పిన నాలుగు తిథులలో ఏదో ఒక రోజు మాత్రమే ప్రారంభించి 12 రోజుల పాటు ఏకధాటిగా చేయాలి.
ఈ మంత్ర జపం వలన మరియు ఈ ప్రసాదం ప్రభావము వలన మానవులకు చురుకైన బుద్ధి ఏర్పడి తప్పక అనుకున్న పరీక్షలలో విజయం సాధిస్తారు.
ఈ పన్నెండు రోజులపాటు ఉదయం పూట జపం అయిపోయాక ఈ పరీక్షలలో గల శాస్త్రములను (సబ్జెక్టులను) అభ్యాసం చేస్తే జ్ఞాపకశక్తి, అవగాహన శక్తి ముందు కంటే బాగా పెరుగుతాయి,
కాబట్టి పరీక్షలకు వెళ్లే పిల్లలందరూ ఈ మంత్రమును అనుష్ఠానము చేయండి.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.