Pages

Monday, May 17, 2021

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

 





🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹



           రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస్తిక హేతువాది , యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి , దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ , సాటిలేని భక్తికీ , రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.


         జన్మ స్థలం , నక్షత్రం మరియు ఇతర వివరాలు :-



                ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం , శాలివాహన శకం ప్రకారం 1005 వ సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి , కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం , చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి , బృహస్పతి వారం , ఆర్ద్రా నక్షత్రం , కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి , తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా , కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని , అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని  అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ , కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ , విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి , అందరికీ ముక్తి కలుగుతుంది గదా !’’ అనే ఉదార భావనతో ఆయన గుడి గోపురం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. 


       రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం , వేదాంత సారం , వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం , శ్రీరంగ గద్యం , వైకుంఠ గద్యం , శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను , జియ్యంగార్లను , పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ , అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.  తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ‘‘ద్రావిడ , సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై , వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి” అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ‘‘భార్గవ పురాణం” గ్రంథానికి పరిష్కర్తగా రచించిన ‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం” వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టాద్వైతం” వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)


            *నామకరణం*


       శిశువు యొక్క జనన మాసం , మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల , శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి , నమ్మాళ్వార్ తన 'తిరువోయ్మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి , గురువు , ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.


      ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు :-


                    మొదటిది , ప్రబలంగా కొనసాగుతున్న , బౌధ్ధ , జైన , శైవ , వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ , ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ , వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.


   రెండవది , ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లోసుగులను సరిదిద్ది , విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.


                  తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-


            ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో , మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.


   దేవుడిని పూజించటం , మోక్షాన్ని సాధించటం , మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.


మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో , తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.


       ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు , తమకు కీడు జరిగినా , పదిమందికి జరిగే మేలుకై , తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.


                వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన , పంచ సంస్కార కర్మ , నాలాయిర దివ్య ప్రబంధ బోధన , శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం , అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.


  వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.


         భాగవత , విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస , పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి , వారికా నామధేయాలను ప్రసాదించి , వ్యాస , పరాశరులకు నివాళులు అర్పించటం.


          ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి , అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.


           తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు


         తిరుమలలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని , శక్తి విగ్రహమో , శివ ప్రతిమో , సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శాక్తేయులతో , శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను , శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ , రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు , శైవాయుధాలు , శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే* *ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.


     అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి , వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను , పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో , మూర్తి స్వరూపనిర్ధారణలో , ఆగమ పద్ధతుల్లో తిరుమల - తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.



!! శ్రీమతే రామానుజాయ నమః !!

శ్రీమతే నారాయణాయ నమః !!


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Monday, April 5, 2021

గురు వ్యాఖ్యనం-53

 





ఓం మం మర్త్య బాధా నివారకాయ, మహాశాంతాయ, సర్వజ్ఞాయనమః


మరణబాధని తొలగించే మహాశాంతస్వరూపుడైన, సర్వమూ తెలిసిన ఈశ్వరుని కొరకు నమస్కారము అని ఈ మంత్రార్థం. ఈ మంత్రం ఎంత గొప్పదో సౌరపురాణం చెబుతోంది. కాల ప్రభావం వలన ఎన్ని పరీక్షలు చేసినా, కొంతమందికి అసలు రోగం ఏమిటో తెలియటంలేదు. 


పూర్వము నందీశ్వరుడు శివుని దగ్గరికి వెళ్లి రోగనిర్ధారణ అవనప్పుడు, రోగముతో నానా బాధ పడుతున్న రోగికి ఏదైనా మంచి మంత్రం చెప్పండి అంటే శివుడు ఈ మంత్రం ఇచ్చాడు. రోగనిర్ధారణ సరిగా చెయ్యలేక పోవడం వలన, అలాంటప్పుడు మందులు సరిగ్గా పనిచేయకపోవడం వలన, మృత్యుగండంలోకి వెళ్లి నిత్య కార్యక్రమాలు చెయ్యలేక, ఎప్పుడూ నీరసంతో కళ్ళు తిరిగి బాధపడేటటువంటి అమాయక ప్రాణులను రక్షించే పరమ పవిత్ర మంత్రం ఇది. 


*మంత్ర ప్రయెాగం - ఫలితం:*


తులసీదళాల రసం, కొంచెం మారేడు ఆకుల రసం ఈ రెండింటినీ శివలింగానికి ఎదురుగుండా పెట్టి, భక్తితో ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు చొప్పున పదకొండు రోజుల పాటు జపం చెయ్యండి. జపం పూర్తి అయ్యాక చేతిలోకి మూడు సార్లు నీళ్లు తీసుకొని శివార్పణమస్తు అని పళ్లెములో నీళ్లు విడిచిపెట్టెయ్యండి. ఆ తరువాత ఆ నీళ్లతో కళ్ళు తుడుచుకొని, ఈ నీళ్లు తులసిమెుక్కలో పొయ్యండి. ఈ రెండు ఆకుల రసాన్ని జపం పూర్తి అయిన తరువాత త్రాగెయ్యండి. 


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యనం-52

 



ఓం  ఐం హ్రీం శ్రీం లింగధారిణ్యై నమః

 

పూర్వము అమ్మవారు భూమండలంలో 108 శక్తి పీఠములను ఏర్పాటు చేసుకున్నది.

       

     పూర్వము సతీదేవి శరీరమును విడిచిపెడితే, శివుడు ఆ శరీరమును భుజం మీద వేసుకొని తాండవమాడాడు. శివుడు సతీదేవి శరీరమును భుజం మీద వేసుకొని ఉన్మాదం తో తిరుగుతూ ఉంటే, లోకాలన్నీ కంపించి పోయాయి, అకాల ప్రళయం వచ్చింది,

దానితో దేవతలంతా భయపడిపోయి పరుగుపరుగున శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొర పెడితే, సతీదేవి శరీరము శివుడి భుజం మీద ఉన్నంత వరకూ ఆయనకు ఈ ఉన్మాదం తగ్గదు అని ఆ శరీరమును ముక్కలు ముక్కలుగా చేసేస్తాను అని విష్ణువు శార్ఙ్గము అనే కోదండమును ఎక్కుపెట్టి బాణములతో సతీదేవి శరీరమును ముక్కలుముక్కలుగా కొట్టేశాడు. అమ్మవారి శరీరభాగాలు భూమి మీద 108 ప్రదేశాలలో పడ్డాయి, అవే 108 శక్తి పీఠాలు. వాటిలో 18 బాగా ప్రసిద్ధికెక్కాయి. అందులో అత్యంత ప్రసిద్ధికెక్కిన శక్తి పీఠము నైమిశారణ్యంలోని లింగధారిణి.

ఈ లింగధారిణి అనే పేరుతో లలితాదేవి నైమిశారణ్యంలో కొలువై ఉన్నది. అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైనది.


లింగధారిణి మంత్రమును ‘ *ఓం  ఐం హ్రీం శ్రీం* ’ అనే బీజాలతో కలిపి 40 రోజులు జపిస్తే మంచి సంతానం కలుగుతుంది.


*మంత్ర ప్రయోగము - ఫలితము:* 


ఈ లింగధారిణి మంత్రమును మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మొదలుపెట్టి 40 రోజుల పాటు ఏకధాటిగా 108 సార్లు జపం చేస్తూ, ఆవుపాలను అమ్మవారికి నైవేద్యముగా పెట్టి దానిని ప్రసాదముగా స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుంది. స్త్రీలు బయట ఉన్న నాలుగు రోజులు విడిచిపెట్టి ఐదవ రోజు నుండి కొనసాగించవచ్చు. ఈ లింగధారిణి మంత్రజపం చేయడం వలన సత్సంతానమే కలుగుతుంది.

 

    నియమము ఏమిటంటే,   ఈ నలభై రోజులపాటు  స్త్రీలు అయినా పురుషులు అయినా మాంసాహారము తినరాదు, మద్యపానం చేయరాదు, మసాలాలు మొదలైన వాటిని తినకూడదు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకొనవలెను, అలా తింటేనే ఈ మంత్రము ఫలిస్తుంది.


     గురువు ద్వారా ఉపదేశం పొంది ఈ మంత్రము చెయ్యడం వల్లనే పూర్వం వశిష్ఠ మహర్షికి వందమంది కొడుకులు పుట్టారని, అందులో శక్తి అనే ఆయన బాగా ప్రసిద్ధికెక్కాడని మనకి సౌరపురాణం చెబుతున్నది.

నైమిశారణ్యంలో ఉన్న లింగధారిణి అనే అమ్మవారు లోకసంచారం చేసి తనంతట తానే సంతానం ప్రసాదించే దేవతనని చెప్పుకొన్నది.

      

    సాధారణంగా అమ్మవారు అలా చెప్పదు. కానీ లింగధారిణి మాత్రం అలా చెప్పింది. ఎందుకంటే చెప్పకపోతే తెలియదు కనుక.

గోమతీ తీరంలో వెలసిన అత్యద్భుతమైన శక్తి పీఠము అది.

ఈ 40 రోజుల కాలంలో మధ్యలో మైల వస్తే ఆపివేసి శుద్ధి అయిన తరువాత కొనసాగించవచ్చు.


    ఈ మంత్రమును ఇంటిలో చేసుకున్నట్లయితే,అటువంటివారు 40 రోజులపాటు రోజుకు 108 సార్లు చొప్పున చేసుకోవాలి, అదే నేరుగా నైమిశారణ్యంలోకి వెళ్లితే కేవలం మూడే మూడు రోజుల్లో రోజుకు వెయ్యి ఎనిమిది (1008) సార్లు చేస్తే చాలు. గోమతిలో స్నానం చేసి అమ్మవారి సన్నిధిలో కానీ లేదా నదీతీరంలో ఎక్కడో ఒకచోట కానీ రోజూ మూడు 1008 సార్లు, మూడు రోజులపాటు చేస్తే వారికి తొందరలోనే సంతానము కలుగుతుంది.


   పూర్వము శ్రీకృష్ణుడు సత్యభామకు సంతానం కలగకపోతే ఆయనే స్వయంగా అమ్మవారిని పూజించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. కృష్ణుడు అంతటివాడు అనుష్ఠానం చేసిన అత్యంత పవిత్రమైన మంత్రము ఇది. ఈ మంత్రము ఇంకా శీఘ్ర కాలంలో ఫలం ఇవ్వడానికి మంత్రజపం చేసిన వారు బంగారము, వెండి లేదా వస్త్రములు దానం చేసుకుంటే శీఘ్ర ఫలప్రాప్తి లభిస్తుంది.



*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యనం-51




ఓం పద్మ నిధయే నమః


శంఖము, పద్మము ఇలా 9  నిధులు ఈ సృష్టిలో ‌ఉన్నాయి. వాటిని నవనిధులు అంటారు. ఈ నిధులలో  పద్మనిధి అని ఒక గొప్ప నిధి ఉంది. లక్ష్మీదేవి 9 నిధులను తన శరీరానికి  9  అలంకారాలుగా చేసుకుంది . అందులో ఈ పద్మనిధి కూడా ఒకటి .


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

                

          నాలుగు చేతులతో, ఎఱ్ఱ తామరపువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీ అమ్మవారి ఒక చిన్న పటాన్ని ఎదురుగుండా పెట్టుకుని, కొంచెం పంచదార నైవేద్యం పెట్టి,  ఈ  నామాన్ని 9 రోజులు రోజుకి 1000 సార్లు జపం చేయాలి. మనకి రావాలసిన ఋణం రప్పిస్తుంది. అవతల వాళ్ళకి ఇవ్వవలసినవి ఇప్పిస్తుంది.

            

         పద్మనిధి యొక్క లక్షణం ఏమిటంటే అప్పులు తీర్చగలిగే శక్తి ఇచ్చి, వారితో మనకి ఏ పీడా లేకుండా హాయిగా,  సుఖంగా ఉండేలా చేస్తుంది. ఈ నామం యావజ్జీవితం చేసినవారి  జీవితంలో ఋణము అనే ప్రసక్తి ఉండదు. ఆఖరున నైవేద్యం పెట్టిన పంచదార ఎవరు పూజ చేశారో వారే తినాలి. బయటివాళ్ళకి పెడితే  వాళ్ళ ఋణాలు విముక్తి అవుతాయి. కుబేరుడిని కూడా ఋణవిముక్తుడ్ని చేసిన ఈ మంత్రం జపించుకుని ధన సంబంధమైన బాధల నుంచి విముక్తి పొందండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

Friday, April 2, 2021

గురు వ్యాఖ్యనం -50






*ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయైనమః* 


పూర్వం సకల ప్రాణులు అమ్మవారిని ఒకసారి భక్తితో ప్రార్థించి, నిత్యం ఏ కార్యక్రమాలలోకి వెళ్ళినా ఆ పనులు అవ్వక భయంకర విఘ్నాలతో బాధపడే మానవుల కష్టాలు ఎలా తొలగుతాయెా, దానికొక మంచి మంత్రమో, లేక మార్గమెా ఉపదేశించమని దేవతలు, ఋషులు కలిసి కోరారు. 


       భండాసురుడు అనే ఒక భయంకర రాక్షసుడు మన్మథుని చితాభస్మం నుండి పుట్టినవాడిని  సంహరించడానికి  అమ్మవారు బయలుదేరింది. అప్పుడు అమ్మవారి శరీరము నుండి మహాగణేశ్వరుడు అనే మహానుభావుడు పుట్టాడు. ఇతడు లేత సూర్యకాంతితో  ప్రకాశిస్తూ, ఒక తెల్లని దంతంతో, చాటంత చెవులతో ఉండి, కిరీటము బాగా పైకి పొడుగ్గా ఉండేటటువంటి స్వావిు.ఈ మహాగణేశ్వరుడు భండాసురుడి దగ్గర ఉండే ఒక 

భయంకర యంత్రాన్ని ధ్వంసం చేసాడు. అప్పుడు అమ్మవారు మెచ్చుకుని, సంతోషించి ఈ నామాన్ని లోకానికి అనుగ్రహించింది. 


*మంత్ర ప్రయోగం - ఫలితం:* 


          ఈ నామాన్ని మనము భక్తితో ఉదయంపూట 40 రోజుల పాటు రోజూ 108 సార్లు చొప్పున  చేసుకుంటే అన్ని రకములైన విఘ్నములు తొలగి కార్యసిద్ధి అవుతుంది. 


*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. 


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-49






*ఓం శం శం శం శ్రీకర్యై నమః*


శ్రీ అనగా లక్ష్మి, ధనము, సంపద. వీటిని కలిగిస్తున్నది కనుక అమ్మవారు శ్రీకరి.అమ్మవారు  ధనాన్ని కలిగించే ఒక మహత్తరమైన శక్తి.

శ్రీకరి అంటే సకల సంపదలను ఇస్తుంది, ధనమును ఇస్తుంది, శాంతినిస్తుంది, ధాన్యము ఇస్తుంది, పుష్టినిస్తుంది, తుష్టినిస్తుంది, ఆనందమును ఇస్తుంది, సేవకులను ఇస్తుంది, గృహాలను ఇస్తుంది, వాక్ శక్తినిస్తుంది. ఇన్ని రకాల చైతన్యములను కలిగిస్తుంది కనుక అమ్మవారు శ్రీకరి.

దీనిని విడతీసి చెప్పకూడదు, కలిపి శ్రీకరి అని చెప్పాలి.

 ఈ మంత్రము మహా భయంకరమైన దారిద్ర్యమును నాశనం చేయడం కోసం ఉపయోగిస్తారు.

అమ్మవారు తలుచుకుంటే భయంకరమైన దారిద్ర్యం నిమిషములో తొలగిపోతుంది.


*మంత్ర ప్రయోగము - ఫలితము:*


అమ్మవారి రూపమును బంగారంతో కానీ, వెండితో గానీ, రాగితో కానీ ఏమీ లేకపోతే మట్టితో కానీ ఒక చిన్న ప్రతిమను చేసి పెట్టుకోండి అది కూడా లేక పోతే ఒక పటమును పెట్టుకోండి.

మారేడు ఆకులను 108కి తక్కువకాకుండా తెచ్చుకోండి.

 ఈ మారేడు ఆకులతో అమ్మను పూజిస్తూ రోజూ వెయ్యి సార్లు 

ఓం శం శం శం శ్రీకర్యై నమః 

అనే మంత్ర జపం చేయండి.

 పూజ చేస్తూ ఉండగా ఆకులు అయిపోయినా కానీ జపము మాత్రం వెయ్యి సార్లు చెయ్యండి.

 ఇలా 90 రోజులు చెయ్యండి.

ఏ రోజుకారోజు పూజ అయ్యాక ఈ ఆకులను పూజా మందిరం లోనే ఒకచోట పెట్టండి, 90 రోజులు పూర్తి అయిన తరువాత ఈ ఆకులను ఏదైనా యజ్ఞానికి ఇవ్వండి లేదా ఎవరూ తొక్కని చోట వేయండి.

ఈ విధముగా 90 రోజులపాటు ఈ మంత్ర అనుష్ఠానము చేస్తే (స్త్రీలు బయట ఉన్న నాలుగు రోజులు ఆపి తరువాత కొనసాగించవచ్చు) మహా భయంకరమైన దారిద్ర్యం నుండి బయటపడతారు.


ఓం శం శం శం శ్రీకర్యై నమ:


*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. 


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-48




*ఓం సం సర్వవిదే నమః*


        విత్ అనే ధాతువుకు తెలియడం అని, సర్వవిత్ అంటే అన్నీ తెలియడం అని అర్థం. అన్నీ తెలిసినటువంటి సకల లోకాలలో ఉన్న సారమును తాను అర్థం చేసుకుని ఇతరులకు అందించేటటువంటి పరమాత్మ కొరకు నమస్కారము. ఇది ప్రత్యేకంగా సూర్యభగవానుని యెుక్క మంత్రం. సర్వవిత్ అనేది చదివినది అర్థం అవడానికి, శాస్త్రాలలో అత్యంత ప్రావీణ్యులు అవడానికి పనికి వచ్చే ఒక గొప్ప మంత్రం. 


              చదివినది బాగా అర్థం అయి, మనకు అందులో పాండిత్యము ఉంటేనే అప్పుడు మనం అందులో రాణిస్తాము. అవగాహనతో చదువుకుంటే జ్ఞాని అవుతాడు. 


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


      ఆరు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం పూట 1000 పర్యాయములు పారాయణ చేస్తే సూర్య భగవానుని దివ్య కటాక్షము లభిస్తుంది. మీరు ఏది చదువుతున్నారో అది మనస్సులో పెట్టుకొని, బాగా అర్థం అవ్వాలని సంకల్పము చెప్పుకోండి. చదివినది అర్ధమై శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపయోగపడే పరమ పవిత్ర మంత్రమిది.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చు కొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. 


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-47




*ఓం క్లీం క్షీరోదధి పుత్ర్యై  నమః* 


ఇది అద్భుతమైన మహాలక్ష్మి మంత్రం. అమ్మవారు పూర్వం పాలసముద్రాన్ని  దేవదానవులు  చిలకగా అందులోంచి పుట్టింది. ఒకప్పుడు దూర్వాస మహర్షి శాపం వల్ల మొత్తం సకల లోకాలలో ఉన్న సంపద సముద్రం పాలైపోయింది. దాంతో ఇంద్రుడు విష్ణువు దగ్గర మొరపెట్టాడు.

                           అప్పుడు శ్రీమహావిష్ణువు దానవులను కలుపుకుని పాలసముద్రం చిలకమన్నాడు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, దేవతలు దానవులని కలుపుకుని, వాసుకిని కవ్వం తాడుగా చేసుకుని, అడుగున కూర్మరాజుగారు పర్వతం కిందికి దిగకుండా మోస్తూండగా, క్షీర సాగరాన్ని మథించారు. ఆ క్షీర సాగర మథనంలో అనేక వస్తువులు పుట్టాయి. అందులో జగన్మాత ఆదిలక్ష్మి పుట్టింది. శ్రీమహావిష్ణువు మెడలో పూలమాల వేసి వరించింది. అప్పటి నుంచి అమ్మవారిని 'క్షీరోదార్ణవ సంభవ' అని 'క్షీరోదధిపుత్రి' అని పిలిచారు.

                          ఇప్పుడు ఈ క్షీరోదధి పుత్రికి కామరాజ బీజము 'క్లీం' కారము, అంటే కోరిన కోరికలు తీర్చే బీజం కలిపితే ఇది ఒక మహా మంత్రం అవుతుంది. మన డబ్బు మనకి సమయానికి చేతికి వచ్చేలా చేసే అద్భుతమైన మంత్రం ఇది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


ఈ మంత్రాన్ని శుక్రవారము నుంచి మొదలుపెట్టి 41 రోజుల పాటు రోజూ శ్రీమహాలక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుని, ఆ పటానికి ఎదురుగుండా మారేడు ఆకులు, తులసి దళాలతోటి పూజిస్తూ 1000 సార్లు ఈ మంత్ర జపం చేయండి. ఏకధాటిగా చేస్తే మీ బాకీలు అన్నీ మీకు వచ్చి తీరుతాయి. సమయానికి ధనమును చేతికి అందేలా చేసే మంత్రం ఇది. అమ్మవారికి తీపిని నైవేద్యంగా  పెట్టండి. మీరు కూడా తినండి.

                    పూజ అయ్యాక ఈ బిల్వ పత్రాలు, తులసి దళాలు యజ్ఞం జరిగే చోట ఇవ్వండి. నదిలో కాని కలపండి. ఈ కాలంలో శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరాదు. మాంసాహార స్వీకారం చేస్తే ఈ మంత్రం వ్యర్థమైపోతుంది. అది కఠోర నియమం.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యనం-46

 



*ఓం కులసంకేతపాలిన్యై నమః* 


మనకు ఉన్న ద్వాదశ అరణ్యములలో నైమిశారణ్యము చాలా గొప్పది.

ఈ నైమిశారణ్యంలో బ్రహ్మదేవుని కమండలం నుంచి ఆవిర్భవించిన గోమతి అనే నది ప్రవహిస్తూ ఉన్నది.

పూర్వం ఋషులందరూ ఇక్కడకు తపస్సు చేసుకోవడానికి వస్తే, ఇక్కడ ఒక నది కూడా కావాలి అని బ్రహ్మదేవుడిని కోరగా, బ్రహ్మదేవుడు తన కమండల జలమును భూమి మీదకు పంపాడు. అలా పంపగా వచ్చిన జలమే ప్రవాహంగా మారి నదిగా మారింది.

నిజానికి నది అంటాము కానీ గోమతిని నదము అనాలి.

 తూర్పున పుట్టి పడమరకు ప్రవహించే వాటిని నదములు అని, పడమర పుట్టి తూర్పుగా ప్రవహించే వాటిని నదులు అని అంటారు కాబట్టి, గోమతి కూడా తూర్పున పుట్టి పడమరకు ప్రవహించి ద్వారక వద్ద పశ్చిమ సముద్రం లో కలుస్తుంది కనుక గోమతిని నదము అనాలి.

ఈ గోమతి నదీ తీరంలో అమ్మవారు రాత్రి పూట తరచుగా ఒక దివ్య రూపంలో తిరుగుతుంది. ఆ దివ్య రూపమునకే కులసంకేతపాలిని అని పేరు. కులసంకేతపాలిని అంటే తన వర్ణాన్ని, తన వంశాన్ని రహస్యముగా పరిపాలించేది అని అర్థము.


మంత్ర అనుష్ఠానములకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ మంత్రములను బయట పెట్టకూడదు. ఇచ్చిన గురువుకు తెలియాలి, శిష్యులకు తెలియాలి. ఆ పరంపరలో వాళ్లంతా, తెలిస్తే వాళ్ళల్లో వాళ్ళకి తెలియాలి తప్ప బయట వాళ్లకు తెలియకూడదు.

కుల సంకేతము అంటే కుండలినీ శక్తిని ప్రచోదనం చేసే ఒక అద్భుతమైన యోగశక్తి.

ఈ యోగశక్తిని కూడా గురువుల ద్వారా తెలుసుకో వలసినదే, కాబట్టి మొత్తం మీద మంత్రాచార రహస్యములను పాలించేది, పరమపవిత్రమైన ఆచారము కలిగినది, యోగాభ్యాస తత్పరుడైన వారిని రక్షించేది; ఇటువంటి దేవతా రూపము కుల సంకేత పాలిని.


ఈ కులసంకేతపాలిని అనే నామాన్ని పూర్వము నైమిశారణ్యంలో ఉగ్రశ్రవుడు అనే పేరు కలిగిన సూతమహర్షి (సూత మహర్షి అసలు పేరు ఉగ్రశ్రవుడు, తరువాత ఆయనకు సూతుడు అని పేరు వచ్చింది) అనుష్ఠానము చేసి లోకానికి అందించాడు.

ఇది అద్భుతమైన జ్ఞాపకశక్తిని ఇచ్చే మంత్రము.

పౌరాణికులలో సూతమహర్షి ఒక్కడే పుస్తకం లేకుండా మస్తకమే సమస్తముగా 18 పురాణములను చెప్పాడు.

మొట్టమొదటగా ఈ సూతమహర్షి వ్యాసునికి శిష్యుడై, వ్యాసుని ద్వారా పురాణములను నేర్చుకుని, తరువాత 88 వేల మంది ఋషులకు ఈ పురాణములను చెప్పాడు.

ఆయనకు ఉన్నంత ధారణాశక్తి మరెవ్వరికీ లేదు.

 ఆ మహానుభావుడు ఇచ్చిన అద్భుతమైన మంత్రము ఈ కులసంకేతపాలిని అనే మంత్రము.


*మంత్ర ప్రయోగము ౼  ఫలితము:* 


ఈ మంత్రమును విడిచిపెట్టకుండా తొమ్మిది రోజులపాటు ప్రతి రోజు 1008 సార్లు జపం చేయండి.

జపము చేసిన వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి వస్తుంది.

 పుస్తకాలు మస్తకానికి ఎక్కి పోతాయి, ఒక్కసారి చదివితే గుర్తుండిపోతుంది.

ఇది అపూర్వమైన ధారణా శక్తిని పెంచే ఒక మహా మంత్రము.

జ్ఞాపక శక్తి లేకపోతే పరీక్షలలో ఏమి రాయలేము.

పూర్వము పురాణములను, వేదములను, వ్యాసములను అప్పజెప్పినట్లుగా ఇప్పుడు కూడా వేదపండితులు గురుముఖతః విని అప్పజెప్పగలుగుతున్నారు. ఆ శక్తి మనందరిలో ఎంతో కొంత ఉంటుంది. దానిని కొందరు అభివృద్ధి చేసుకుంటున్నారు, కొందరు చేసుకోలేకపోతున్నారు. అలా అభివృద్ధి చేసుకోవడానికి ఈ మంత్రము ఉపయోగపడుతుంది.

చాలామంది మనము ప్రయత్నం చేస్తే చాలు కానీ మంత్రము అవసరం లేదు అంటారు, అది కేవలం ఒట్టి భ్రమ, అన్నీ ఉండాలి.

 మన శరీరము ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం పాలై పోతుంది, అలాగే అపార ధారణాశక్తి ఉన్నా ఈ మంత్ర అనుష్టానము లేకపోతే కొంత కాలానికి అది నశించిపోతుంది.

కాబట్టి జ్ఞాపక శక్తిని పొందడానికి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ తప్పకుండా నిరంతరము అనుష్ఠానము చేయవలసిన పవిత్రమైన మంత్రము ఇది, కాకపోతే శీఘ్ర ఫల ప్రాప్తికి మాత్రం నియమం ఏమిటంటే తొమ్మిది రోజులపాటు విడిచిపెట్టకుండా 1008 సార్లు ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చొని చేయాలి.


ఇదే మంత్రమును మీరు నైమిశారణ్యంలో కానీ చేసినట్లయితే మీకు తిరుగులేని జ్ఞాపక శక్తి వస్తుంది.


ముఖ్యంగా పెద్ద పెద్ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు వెళ్ళే వాళ్లకు ఈ మంత్రము చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్నల పత్రమును చూడగానే సమాధానములు చదువుకున్నవి వెంటనే గుర్తుకు వస్తాయి.


*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. 


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యనం-45

 

 


*ఓం  పారిజాతద్రుమూలస్థాయ నమః* 


పారిజాత వృక్షము మూలములో ఉంటాడు హనుమంతుడు. ఈ మంత్రాన్ని మంచి ఉద్యోగం పొందడానికి జపం చేయాలి. ఈ మంత్రానికి నియమం ఏమిటంటే ముందు గురుపాదాలని ఆశ్రయించి ఈ మంత్రం పొందాలి. మూడు రోజుల పాటు గురుధ్యానంతో ముందు, ఉపదేశం పొందాక ఇంట్లో జపం చేసుకోవచ్చు. తరువాత నాలుగవరోజు నుంచి మొదలుపెట్టి అంటే నాలుగవ రోజు నుంచి మొదలుపెట్టిందే మొదటి రోజు అవుతుంది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

   ఈ మంత్రానుష్ఠానం 40 రోజులు దీక్షగా చేస్తే మంచి అద్భుతమైన ఉద్యోగం వస్తుంది. ఒక రాగి, వెండి , ఇత్తడి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన చిన్న హనుమంతుని విగ్రహం తీసుకోండి. బొటనవేలు దాటకుండా ఉండాలి. దానిని పూజామందిరములో పెట్టుకుని ప్రతిరోజూ సిందూరంతో, ఈ మంత్రముతో హనుమంతుడిని  పూజించాలి.

      

    ఇక్కడ కూడా చిన్న నియమం ఉంది. తమలపాకు మీద హనుమంతుని విగ్రహం పెట్టాలి. ఏరోజుకారోజు  ఆ తమలపాకు మార్చేయాలి. కుంకుమని మాత్రం పూజామందిరములోనే పెట్టండి. ఈ తమలపాకు మీద హనుమంతుడిని పెట్టేటప్పుడు మనకేసి తమలపాకు ముచ్చిక ఉండాలి, కొస హనుమంతుని కేసి ఉండేలాగా పెట్టి దాని మీద హనుమంతుని విగ్రహం పెట్టి ఈ మంత్ర జపం చేస్తూ కుంకుమతో పూజ చేయండి.

    

    పటికబెల్లం కాని, పంచదార కాని, బెల్లం కాని, అప్పాలు కాని లేదా కొబ్బరికాయ కాని ఏదో ఒక నివేదన పెట్టండి. ఈ కాలంలో తొందరపడి కోపాన్ని తెచ్చుకోవద్దు. కోపం వల్ల జపం నిష్ప్రయోజనం అవుతుంది. సిధ్ధిని పాడు చేస్తుంది. మండల దీక్ష అయిపోయాక  ఈ హనుమంతునికి ఆఖరి రోజు అప్పాలు నైవేద్యం పెట్టి, మూడు కొబ్బరికాయలు కొట్టి హనుమంతుని యథాస్థానానికి పంపండి. శుక్ర, మంగళవారాలు అయితే  ఆ తరువాతి రోజు చేయండి. అప్పాలు అందరికీ ప్రసాదంగా పెట్టండి. ఈ కుంకుమని ఎక్కడికి వెళ్లినా ధరించండి. సంవత్సరము తిరిగే లోపు మంచి ఉద్యోగం వస్తుంది.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

Sunday, March 14, 2021

గురు వ్యాఖ్యనం-44






ఓం. విద్యానిధయే  నమః


ఈ కలియుగంలో మానవులకి జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది.కొంతమంది పిల్లలకి జ్ఞాపకశక్తి ఉండదు లేదా కొన్ని అక్షరములు సరిగ్గా ఉచ్చరించలేరు.కారణం కొన్ని సరస్వతీ దోషాలు ఉండడం వల్ల.

                         పూర్వం సత్యవ్రతుడు అను పేరు కలిగిన ఒక వ్యక్తి  సరిగ్గా పలకలేకపోతే అమ్మవారు స్వయంగా ఒక సరస్వతీ కవచాన్ని ఇచ్చింది.కవచాన్ని చదవలేని వాళ్ళకి స్వయంగా సూర్యభగవానుడు యాజ్ఞవల్క్యునికి , శ్రీ కృష్ణుడు సూర్యుడికి చెప్పిన ఒక గొప్ప మంత్రంవై.ధారణా శక్తిని ఇస్తుంది.దోషనివారణ కోసం ఇవ్వబడిన ఒక గొప్ప అత్యద్భుతమైన మంత్రం ఇది.


మంత్ర  ప్రయోగం - ఫలితం:


దీనిని కొన్ని నక్షత్రాలలో చేస్తే బాగా పట్టిస్తుంది.మూలా నక్షత్రము అంటే అమ్మవారికి చాలా ఇష్టం.శరత్కాలంలో మూలా నక్షత్రం నాడు ఆశ్వయుజ మాసంలో సరస్వతీ రూపం లో అమ్మవారికి అలంకారం చేస్తారు.

                       ప్రతి మాసంలో వచ్చే మూలా నక్షత్రం నాడు , పూర్ణిమా తిథి నాడు , శుక్రవారం నాడు ,అమావాస్య నాడు ఈ 4 తిథులలోను ఈ నామాన్ని 1000 సార్లు పిల్లల తో చేయించండి. మూలా నక్షత్రం అయితే వెయ్యి సార్లు చేస్తే లక్ష సార్లు చేసిన  జపంతో సమానం.

                          ఈ జపం వల్ల అసాధారణమైన ధారణ పెరుగుతుంది.ఒత్తిడిని తొలగ జేసి సరియైన సమయంలో జ్ఞాపకశక్తిని ఇస్తుంది.శివుడు అంతటి వాడు ఈ జపం చేసి వ్యాకరణ సూత్రాలు ఇవ్వగలిగాడని కాళికా ఉపపురాణం చెబుతున్నది.శ్రీకృష్ణుడు గోలోకంలో రాజు చేత చేయించాడు.ఇది అంత  గొప్ప నామం.తెల్ల పువ్వులతో ఈ నామం చేస్తూ సరస్వతికి పూజ చేస్తే అపూర్వమైన పాండిత్యం కూడా వస్తుంది.ఇవన్నీ చేసి సరస్వతీ కటాక్షం పొందండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-43

 




 కోణం నీలాంజనప్రఖ్యం 

 మందచేష్టా  ప్రసారిణం

 ఛాయా మార్తాండ సంభూతం 

నమస్యామి శనైశ్చరం

                

పిల్లలతో నిత్యం తగాదా పడే తల్లిదండ్రులు  కలియుగంలో పెరుగుతారట.పూర్వజన్మలో ఋణానుబంధం ఉంటేనే భార్య,పిల్లలు , ఇల్లు ఇవ్వన్నీ మనకు దక్కుతాయి.ఈ ఋణానుబంధంలో ఎక్కడో తేడా ఉంటే శత్రువులు కూడా పిల్లలుగా పుట్టి తల్లిదండ్రులను పట్టి పీడించేస్తూ ఉంటారు.చాలామందికి  ఇవాల వచ్చే సమస్యలన్నీ యమధర్మరాజుగారి ద్వారా పూర్వం చిత్రగుప్తుడు విన్నాడు.

                          పిల్లలు స్కూలుకి వెళ్లక నానా బాధలు పెడుతుంటే దీనికి గల కారణం శని సంబంధమైన దోషం ఉండడం.రెండవది  తల్లితండ్రుల మాట వినకుండా గొడవ చేస్తూంటారు.ఇలా పెళ్ళి విషయంలో, విద్యా విషయంలో ఇంకా అన్ని విషయాలలో తల్లి తండ్రులతో తగాదా పడే పిల్లల వల్ల   వాళ్ళకి ఎప్పుడూ తలనొప్పే.

                         వీరిని సరియైన మార్గములో పెట్టడానికి సూర్యభగవానుడు శనైశ్చర మంత్రాన్ని ఉపదేశించాడు.


మంత్ర ప్రయోగం - ఫలితం:


శనివారం నాడు 6 గంటల నుంచి 7 గంటల దాకా శని హోరా అని ఉంటుంది.ప్రతి శనివారం  ఇది ఒక సంవత్సరం చేయండి.108 కాని 1000  కాని ఒక ఏడాది చేస్తే పిల్లలతో ఐకమత్యం వస్తుంది. పిల్లలు సుఖంగా ఉంటారు.వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.పెళ్ళిళ్ళల్లో కాని ,చదువుల్లో కాని ఏ ఇబ్బందులూ రావు.ఆఖరున సంవత్సరము  పూర్తి అయ్యాక ఒక శనైశ్చరుడి ఆలయానికి వెళ్ళండి.నువ్వులనూనెతో అభిషేకం చేయించుకోండి.యథాశక్తి దక్షిణ ఇవ్వండి.కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. పిల్లలకి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-41

 





ఓం అకులాయై సర్వ విజయాయై నమః


కుల సంబంధం కానిది అకుల. 'కుల' అను ఒక మంత్ర అనుష్ఠాన మార్గము ఉన్నది.ఆ అనుష్ఠానాన్ని సక్రమంగా తీర్చిదిద్దేదని అర్థం.నిజానికి అమ్మ కుల ,రూప ,మతాంత బేధములేని జగన్మాత. ఇటువంటి తల్లి సర్వవిజయాలనూ చేకుర్చి పెడుతుంది.

                     ఇది వెలి నుండి బయటపడడానికి ఏకాకిగా మిగలకుండా మానవులను సంఘజీవులుగా చేసే మంత్రం.కులంలో కాని, మతంలో కాని, గ్రామంలో కాని లేదా కవి గారికి ఇటువంటి కళాకారుల సంఘాల్లో నుంచి కాని ఒక వ్యక్తిని పక్షపాతంతో గెంటేసి వాడిని పైకి రానివ్వకుండా ఎవరైనా చూస్తూ ఉంటే అటువంటప్పుడు ఆ బయట పడిన వ్యక్తి బాధపడడం కంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయమన్నారు.ఈ మంత్రం జపం చేస్తే మళ్ళీ వాళ్ళే దగ్గరకు తీసుకుని గౌరవిస్తారు.


మంత్ర ప్రయోగం - ఫలితం:


11 శుక్రవారాల పాటు ఉదయం పూట ఎఱ్ఱగా ఉన్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి 500 పర్యాయాలు జపం చేసుకోండి.జపం అయిపోయాక గరికని,నీళ్ళని రెండు చేతులలో కి తీసుకుని ఆ సూర్యుడికి అర్ఘ్యంగా ఇవ్వండి.ఇది తులసి కోటలో కాని ఎవ్వరూ తొక్కని చోట  కాని చేయండి.ఇది 9 శుక్రవారాలు చేయాలి.ప్రత్యేక నివేదన  అక్కర్లేదు.పదిమందితో చొరవగా మెలిగి తద్వారా సుఖంగా జీవిస్తొడు మానవుడు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-40

 




ఓం గం గజకర్ణికాయ నమః


ఇది విఘ్నేశ్వర మంత్రం లో ఒక గొప్ప మంత్రం.వినాయకునికి ఒక 16 నామాలు ఉన్నాయి.

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమకేతుర్గణాధ్యక్షః  ఫాలచంద్రోగజాననః

వక్రతుండః శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః

ఇవి ఉదయ కాలంలో చదివితే మరీ మంచిది.ప్రయాణంలో చదివితే విఘ్నాలు తొలగిస్తాయి.

                      కలియుగంలో చాలా తొందరగా చెవుడు వస్తోందిట. తెలుగులో పోతనగారు కూడా అలసులు,మంద బుద్ధులు,అల్పతరాయువులు,ఉగ్రరోగ సంకలితులు,మందభాగ్యులు సుకర్మములెన్నియు చేయజాలరీ  కలియుగమందు  మానవులు అని కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు, రోగాలతో ఉంటారు.చెవుడు వల్ల నానా యాతన పడుతూ ఉంటారు అని చెప్పారు.ఈ చెవిటిని తగ్గించి శ్రధ్ధగా వినగలిగే సామర్థ్యాన్ని ఇచ్చే మంత్రం ఇది.


మంత్ర ప్రయోగం - ఫలితం:


బుధవారం అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం.వినాయకుని ప్రతిమని మట్టితో కానీ వెండితో కానీ,  పటం కానీ పెట్టుకుని  దాని ఎదురుగుండా చాప,దర్భ,పీట వీటిల్లో ఏదో ఒక ఆసనం వేసుకుని  ఈ నామాన్ని 108 సార్లు  ప్రతి బుధవారం  గరికని తీసుకుని చెవి దగ్గర పెట్టి ఈ మంత్రం చదువుతూ విఘ్నేశ్వరుడి మీద  పెట్టండి.

                            గం అనే బీజం విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. మూలాధారచక్ర అధిష్ఠాన దేవత గణపతి. ఆయన నాదం' గం' అనే బీజం.ఈ బుధవారం నాడు కొంచెం బెల్లము ముక్క నైవేద్యం పెట్టి ఈ రోగి దానిని తినాలి.సాయంత్రం అయ్యాక ఈ గరికని పక్కకి పెట్టి పటాన్ని ఒక పురోహితుడికి దక్షిణతో దానం చేయండి.9 బుధవారాలు గణపతిని  గరికతో ఈ మంత్రం తో పూజిస్తే మంచి శ్రవణ శక్తి వస్తుంది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-39





ఓం  పంచతన్మాత్ర సాయకాయై నమః


మంత్రమును  సరియైన రీతిలో అర్థం చేసుకుని అనుష్ఠానం చేస్తే మానవుడు సాధించ లేనిదంటూ ఉండదు.ఆత్మ స్థైర్యం కావాలి . విశ్వాసం కావాలి.అటువంటివాటిలో మానసిక శత్రుపీడా నివారిణి నిరంతరం ప్రశాంతత నిచ్చే అధ్బుతమైన మంత్రంగా చెప్పారు.

                       అందుకే దీనిని మానసిక శత్రుపీడా నివారక మహామంత్రం అని కూడా బ్రహ్మాన్డపురాణం చెబుతోంది.తన్మాత్రలు అంటే శబ్ద ,రూపం, రసం ,స్పర్శ, గంధాలు.భూమి , అగ్ని ,జలం , వాయువు , ఆకాశం ఇవి పంచభూతాలు.ఈ పంచభూతాలకి ఐదు లక్షణాలు ఉన్నాయి.

                        భూమికి వాసన ఇచ్చే లక్షణం అందుకే పృథ్వీ గంధవతి'.అగ్నిలో దాహక  శక్తి ఉంది. నీటిలో రసశక్తి ఉంది.ఆకాశం శబ్ద ప్రసారం చేసి శబ్దాన్ని అందరికీ అందిస్తుంది.వాయువుకి స్పర్శ అనే ఒక లక్షణం ఉన్నది.ఇలా ఐదు భూతాలకి ఐదు తన్మాత్రలు ఉన్నాయి.ఈ తన్మాత్రల వల్ల అమ్మవారు లోకాలను సృష్టించింది.ఈ పంచతన్మాత్రలని అరవిందము,అశోకము , చూతము ,నవమల్లిక , నీలోత్పలము అని పేరు కలిగిన ఐదు పువ్వులుగా మార్చుకున్నాయి. ఈ పువ్వులే బాణాలు.ఈ పువ్వుల బాణాలతో శత్రువులని పడ గొడుతున్నది.


మంత్ర ప్రయోగం - ఫలితం:

ఇది శుక్రవార మంత్రం.ప్రతి శుక్రవారం పవిత్రంగా స్నానం చేసి అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకుని ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకుని 1008 సార్లు అని జపం చేయండి.18 శుక్రవారాలు అనుష్ఠానం చేస్తే మానసిక శత్రుపీడ తొలగిపోతుంది.సంపదలు వస్తాయి.అన్ని రంగాలలో విజయం లభిస్తుంది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...